హైదరాబాద్ : గతంలో టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీ అంటూ రైతులకు అన్యాయం చేయడం తగదని కొత్త ప్రభుత్వాన్ని ఉద్దేశించి చంద్రబాబు అన్నారు. ఏపీ టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఈరోజు సమావేశమయ్యారు. రైతులకు రుణమాఫీ చెల్లింపులను ప్రభుత్వం వెంటనే అందించాలని, నాలుగు, ఐదు విడతల రుణమాఫీ మొత్తాన్ని వడ్డీతో సహా వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు మారినంత మాత్రాన విధానాలు మారవని, ఏ ప్రభుత్వమైనా లబ్ధిదారులకు నష్టం చేసేదిగా ఉండకూడదని అన్నారు. లబ్ధిదారులకు చెల్లించాల్సిన మొత్తాన్ని ఎగ్గొట్టడం అమానవీయమని, రుణమాఫీ విషయమై శాసనసభ, మండలిలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొద్దామని తమ నేతలతో చంద్రబాబు చెప్పినట్టు సమాచారం.
Mon Jan 19, 2015 06:51 pm