కొత్తగూడెం : పోడు భూముల విషయంలో అమాయక ప్రజలను మావోయిస్టులు తప్పుదోవ పట్టిస్తున్నారని, ఇలాంటి చర్యలను ఉపేక్షించేలేదని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్దత్ హెచ్చరించారు. 20 రోజులుగా జిల్లాలోని కరగూడెం, ఏడూళ్ల బయ్యారం, గుండాల, మణుగూరు ఏరియాలలో హరిభూషణ్, దామోదర్, లచ్చన్న, రీనా, రాజిరెడ్డి అలియాస్ వెంకన్న, భద్రు, మంగు, మంగ్లూతో పాటు మరో 30 మంది అమాయక ప్రజలను పోడు భూముల విషయంలో తప్పుదోవ పట్టిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ సమాచారంతో సుమారు మూడు వేల మంది పోలీసు బలగాలతో అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారని, అడవిలో అణువణువునా మావోయిస్టుల కోసం గాలిస్తున్నామని చెప్పారు. వారం రోజుల నుంచి మారుమూల గ్రామాల్లో సైతం మావోయిస్టుల ఫొటోలను అతికిస్తున్నామని, కరపత్రాలు విడుదల చేశామన్నారు. మావోయిస్టుల గురించి కచ్చితమైన సమాచారం ఇచ్చిన వారికి రూ.5 లక్షల నగదు బహుమతి ఇస్తామని ప్రకటించారు. సమాచారం ఇచ్చిన వ్యక్తుల వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. వివరాలు తెలిసిన వారు కొత్తగూడెం జిల్లా ఎస్పీ కార్యాలయం 8332861100, భద్రాచలం ఏఎస్పీ- 9440795319, ఇల్లెందు డీఎస్పీ 9440795333, మణుగూరు డీఎస్పీ 9440795326, పాల్వంచ డీఎస్పీ 9490800100, కొత్తగూడెం ఓఎస్డీ కార్యాలయం 9440372157లో తెలపాలన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm