హైదరాబాద్ : ప్రముఖ టెలికాం నెట్వర్క్ రిలయన్స్ జియోకు ఇంటర్ కనెక్షన్ పాయింట్లను కేటాయించేందుకు నిరాకరించిన భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలపై భారీ జరిమానా విధించేందుకు డిజిటల్ కమ్యునికేషన్స్ కమిషన్ (డీసీసీ) ఆమోదం తెలిపింది. రిలయన్స్ జియోకి ఇంటర్ కనెక్టివిటీ పాయింట్లను కేటాయించేందుకు నిరాకరించాయనే కారణాలతో ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలపై రూ. 3,050 కోట్ల జరిమానా విధించాల్సిందిగా భారతీయ టెలికాం నియంత్రణ ప్రాధికార సంస్థ (ట్రాయ్) డీసీసీకి 2016 అక్టోబరులో ప్రతిపాదించింది. ఈ మేరకు ట్రాయ్ నిర్ణయాన్ని సమర్థిస్తూ వాటిపై భారీ జరిమానా విధించేందుకు అంగీకరిస్తూ డీసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ప్రస్తుతం టెలికాం రంగంలో నెలకొన్న ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో వీటిపై విధించిన జరిమానా విషయంలో పునరాలోచించాల్సిందిగా ట్రాయ్కి డీసీసీ సూచించినట్లు డీసీసీకి చెందిన ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. సరైన అనుసంధాన పాయింట్లను కేటాయించని కారణంగా నెట్వర్క్ సమస్యలు తలెత్తి దాదాపు 75 శాతం కాల్స్ కనెక్ట్ అవడం లేదంటూ రిలయన్స్ జియో ట్రాయ్ని ఆశ్రయించడంతో ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలపై జరిమానా విధించాల్సిందిగా ట్రాయ్ డీసీసీకి ప్రతిపాదించింది.
Mon Jan 19, 2015 06:51 pm