న్యూఢిల్లీ: రైల్వే ప్లాట్ఫారాలపై వ్యర్థంగా పడివుండే వాటర్, కూల్డ్రింక్ ప్లాస్టిక్ బాటిళ్లతో నరికొత్త టీ షర్టులు రూపొందించేందుకు సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే సన్నాహాలు చేస్తోంది. రైల్వే స్టేషన్లలో ఏర్పాటుచేసిన బాటిల్ క్రషర్ మెషీన్ నుంచి వచ్చే వచ్చే ప్లాస్టిక్ను వినియోగించి టీ షర్టులు రూపొందించనున్నారు. ఈ టీ షర్టులు అన్ని కాలాల్లోనూ ధరించేందుకు అనువుగా ఉంటాయట. ఈ టీషర్టుల రూపకల్పనకు ముంబైకి చెందిన ఒక కంపెనీతో రైల్వే శాఖ ఒప్పందం కుదుర్చుకుంది. సదరు కంపెనీ చేపట్టిన టీ షర్టు రూపకల్పన ప్రయోగం విజయవంతమైంది. రైల్వే అధికారి రాజేష్ కుమార్ మాట్లాడుతూ రాంచీలో ఏర్పాటుచేసిన ఒక ప్రదర్శనలో ఈ టీషర్టులు ఉంచామని చెప్పారు. ఇదిలావుండగా ప్రయాణికులకు వారు వాడిన కూల్డ్రింక్, వాటర్ బాటిళ్లకు ఐదు రూపాయలు ఇవ్వనున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. క్రషర్ మెషీన్లో బాటిల్ వేసిన అనంతరం ఫోన్ నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు ప్రయాణికునికి ఐదు రూపాయలు అందుతాయి. ప్రస్తుతానికి ఈ యంత్రాలను బీహార్లోని పట్నా జంక్షన్, రాజేంద్ర నగర్, పట్నా సాహిబ్, దానాపూర్ స్టేషన్లలో ఏర్పాటు చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm