హైదరాబాద్ : ప్రపంచకప్ ముగిసిన నేపథ్యంలో టోర్నీలో ఐదుగురు ప్రత్యేక బ్యాట్స్మెన్ పేర్లను ఐసీసీ ప్రకటించింది. ప్రపంచకప్ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన భారత హిట్మ్యాన్ రోహిత్ శర్మకు ఇందులో చోటు దక్కడం విశేషం. ఈ మేరకు ఐసీసీ తన ట్విటర్ ఖాతాలో 'ఈ ఐదుగురు బ్యాట్స్మెన్ ప్రపంచకప్ టోర్నీలో అత్యంత ప్రత్యేకం' శీర్షికతో ఓ వీడియోను ఉంచింది. ఇందులో రోహిత్ శర్మతో పాటు మరో నలుగురి పేర్లను పొందుపర్చింది. ఈ జాబితాలో రోహిత్ తొలి స్థానంలో ఉండగా.. ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్, షకీబ్ అల్ హసన్, కేన్ విలియమ్సన్, జో రూట్ తరువాతి స్థానాల్లో ఉన్నారు. రోహిత్ శర్మ 81 సగటుతో 648 పరుగులు చేసి ప్రపంచకప్ 2019 టోర్నీ మొత్తంలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్గా నిలిచిన విషయం తెలిసిందే. సెమీ ఫైనల్లో న్యూజిలాండ్తో తలపడిన భారత్ పోరాడి ఓడడంతో రోహిత్ శ్రమ ఒకరకంగా వృథా అయిందనే చెప్పాలి. అలాగే ప్రపంచకప్ సంగ్రామం ముగియడంతో టోర్నీ ఉత్తమ జట్టును సోమవారం ఐసీసీ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిలోనూ రోహిత్కు చోటు దక్కడం విశేషం. భారత్ నుంచి యార్కర్ల కింగ్ జస్ప్రిత్ బుమ్రాకు సైతం స్థానం కల్పించారు.
Mon Jan 19, 2015 06:51 pm