న్యూఢిల్లీ: అతి తక్కువ ధరలతో ప్రయాణికులకు ఏసీ బోగీ సౌకర్యాన్ని కల్పిస్తున్న గరీబ్రథ్ రైళ్లను రద్దుచేసే ఆలోచన లేదని భారతీయ రైల్వేశాఖ తేల్చి చెప్పింది. గత కొన్ని రోజులుగా వీటిని రద్దుచేస్తారు అంటూ వదంతులు వస్తున్న నేపథ్యంలో రైల్వే మంత్రిత్వశాఖ పై విధంగా స్పందించింది. ప్రస్తుతం దేశం మొత్తం మీద రాకపోకలకు గానూ 26 జతల గరీబ్రథ్ రైళ్లు నడుస్తున్నట్టుగా ఆ శాఖ పేర్కొంది. ఉత్తర రైల్వే జోన్లో రైల్వే బోగీల కొరత కారణంగా రెండు వారాంతపు గరీబ్రథ్ రైళ్లను రద్దుచేసి వాటిని ఎక్స్ప్రెస్ రైళ్లుగా నడుపుతున్నామని, ఆగస్టు 4 నాటికి వాటిని తిరిగి మళ్లీ ఏర్పాటు చేస్తామని రైల్వేశాఖ వెల్లడించింది. 2006లో అప్పటి రైల్వేమంత్రిగా ఉన్న ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ హయాంలో మధ్య తరగతి వారికి ఏసీబోగీ సౌకర్యాన్ని కల్పించాలనే ఉద్దేశంతో గరీబ్రథ్ రైళ్లను ప్రారంభించారు. బిహార్లోని సహస్ర నుంచి పంజాబ్లోని అమృత్సర్ స్టేషన్ల మధ్య మొదటి గరీబ్రధ్ రైలు నడిచింది.
Mon Jan 19, 2015 06:51 pm