ఇస్లామాబాద్: ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్లో వీఐపీ సంప్రదాయానికి స్వస్తి చెబుతున్నట్లు ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇదివరకే ప్రకటించారు. ఆయన త్వరలో అమెరికా వెళ్లనున్నారు. అక్కడికి వెళ్తాను.. కానీ విలాసవంతమైన హోటళ్లలో మాత్రం బస చేయనని చెప్పారు. ఖర్చు తగ్గించుకునేందుకు ఇదో మార్గమమని ఆయన తెలిపారు. వీఐపీ పద్దతిని పక్కన పెట్టడం వల్ల ప్రజల్లోనూ తమ ప్రభుత్వంపై మంచి అభిప్రాయం ఏర్పడుతుందనేది ఆయన అభిప్రాయం. అయితే ఆదేశ పరిశ్రమలు, ఉత్పత్తి మంత్రిత్వ శాఖ కార్యాలయాల్లో మాత్రం వీఐపీ బాత్రూమ్లను ఏర్పాటు చేశారు. అక్కడి బాత్రూమ్స్ వద్ద బయోమెట్రిక్ యంత్రాలను ఉంచారు. ఆ శాఖ అదనపు సెక్రటరీ, అంతకు పై స్థాయి అధికారుల కోసం ప్రత్యేకంగా వాటిని ఏర్పాటు చేశారు. పరిశ్రమల శాఖ అధికారులు, మంత్రులతో పాటు అంతే స్థాయి ఉన్న ఇతర మంత్రిత్వ శాఖ అధికారులు వాటిని ఉపయోగించుకోవచ్చు. దీనిపై పాకిస్థాన్ ప్రభుత్వం మరోసారి నవ్వుల పాలైంది. ఈ బాత్రూమ్కు సంబంధించిన ఓ ఫొటోను నైలా ఇనాయత్ అనే పాత్రికేయురాలు ట్విటర్లో పంచుకుంది. ఈమె ట్వీట్తో పాటు ఫొటో కూడా వైరల్ అయింది. అధికారులకు బాత్రూమ్లు వద్ద మాత్రం వీఐపీ సౌలభ్యం లభిస్తోందంటూ నెటిజన్లు సెటైర్లు పేలుస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm