న్యూఢిల్లి : ఢిల్లి మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కన్నుమూశారు. ఆమె వయస్సు 81 సంవత్సరాలు. కొంత కాలంగా షీలా దీక్షిత్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, దివంగత షీలా దీక్షిత్ పంజాబ్లోని కపుర్తలాలో పంజాబీ ఖత్రీ కుటుంబలో 1938 మార్చి 31న జన్మించారు. ఢిల్లిలోని కాన్వెంట్ జీసస్, మేరీ స్కూల్లో విద్యాభ్యాసం చేసిన షీలా దీక్షిత్ హిస్టరీలో డిగ్రీ, ఎంఎ పట్టా పుచ్చుకున్నారు. మొట్టమొదటి సారిగా 1984-89 ప్రాంతంలో ఉత్తర్ ప్రదేశ్లోని కన్నౌజ్ లోక్సభ నియోజక వర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 1998 నుండి 2013 వరకు 15 ఏళ్లపాటు ఢిల్లీ ముఖ్యమంత్రిగా షీలా దీక్షిత్ పనిచేశారు. ఢిల్లీ ఆభివృద్ధిలో ఆమె ముద్ర ఎన్నటికీ చెరగనిది. 2014 మార్చి 11 నుంచి అదే సంవత్సరం ఆగస్ట్ 25 వరకు కేరళ గవర్నర్గానూ కొనసాగారు. ఢిల్లి కాంగ్రెస్ అధ్యక్షురాలిగా గత జనవరి నెలలో బాధ్యతలు స్వీకరించారు. మే నెలలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఎండను కూడా లెక్క చేయకుండా ప్రచారంలో పాల్గొన్నారు. షీలా మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, అధ్యక్షుడు రాహుల్ గాంధీలు దిగ్భ్రాంతికి గురయ్యారు.. ఆమె మృతికి సంతాపం ప్రకటించారు.. అలాగే పలువురు రాజకీయ ప్రముఖులు కూడా షీలా మృతికి సంతాపం తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm