న్యూఢిల్లీ: బాలీవుడ్ నటి ఈషా గుప్తాపై ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త రోహిత్ విజ్ పరువునష్టం దావా దాఖలు చేశారు. తనపై చేసిన లైంగిక ఆరోపణలకుగాను రోహిత్ తన న్యాయవాది వికాస్ పహ్వా ద్వారా న్యూఢిల్లీలోని సాకేత్ కోర్టులో ఈషా గుప్తాపై ఐపీసీ సెక్షన్ 499, 500ల కింద కేసు దాఖలు చేశారు. తనపై నిరాధార ఆరోపణలు చేసిన సదరు వ్యక్తిని చట్ట ప్రకారం శిక్షించి తగిన నష్టపరిహారం ఇప్పించాల్సిందిగా కోరాడు. పిటిషన్ను స్వీకరించిన న్యాయస్థానం విచారణను ఆగస్టు 28వ తేదీకి వాయిదా వేసింది. పిటిషనర్ వాదనలను కోర్టు రికార్డు చేయనుంది. ఈ నెల 6వ తేదీన ఈషా తన ట్విట్టర్ అకౌంట్లో వరుస ట్వీట్లు చేస్తూ రోహిత్ విజ్ చూపుల్తోనే తనను అత్యాచారం చేసినట్లు పేర్కొంది. అతను నాతో మాట్లాడలేదు, తాకలేదు. కానీ రాత్రంతా తదేకంగా చూస్తూనే ఉన్నాడు. తన చూపుల్తోనే అసౌకర్యానికి గురిచేశాడు. అతను అభిమాని కాదు, నటుడు కాదు. మనకి ఇంకా రక్షణ ఎక్కడిది? ఆడదానిగా పుట్టడం శాపమా? అని ఆమె ప్రశ్నించారు.
Mon Jan 19, 2015 06:51 pm