సిరిసిల్ల: రాష్ట్రంలోని పేద వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం పెన్షన్ను 200 నుంచి 1000కి పెంచారని, ఇప్పుడు ఆ వెయ్యిని కూడా 2వేలకు పెంచుతున్నట్లు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. బీడీ చుట్టే వారికి పెన్షన్ కల్పించిన ఏకైక నాయకుడు కేసీఆర్ అని చెప్పుకొచ్చారు. ఎన్నికల సందర్భంగా రూ.2 వేలు ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారని, ఆ హామీ మేరకు ఇప్పుడు పెంచిన పెన్షన్ను ఇస్తున్నామని చెప్పారు. శనివారం సిరిసిల్లో హరితనేస్తం సీడీ ఆవిష్కరణ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెంచిన పెన్షన్లను లబ్దిదారులకు అందజేశారు. అనంతరం మాట్లాడిన కేటీఆర్.. పెన్షన్ అర్హుల వయసు 57ఏళ్లకు తగ్గించడం వల్ల అదనంగా 8 లక్షల మంది లబ్ది పొందనున్నారని వివరించారు. బీడీ కార్మికులు లక్షన్నర మందికి నెలకు రూ.2వేలు రాబోతున్నాయన్నారు. 17శాతం వృద్ధితో రాష్ట్రం దేశంలోనే ముందు వరుసలో ఉందన్నారు. పేదల ఇళ్లకు పట్టాలు ఇచ్చి, వారికి లోన్ తీసుకునే సదుపాయం కల్పించామన్నారు. మండేపల్లిలో 1360 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు పూర్తయ్యాయని ఎమ్మెల్యే కేటీఆర్ తెలిపారు. త్వరలోనే వాటిని లబ్దిదారులకు అందజేస్తామన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm