ఇటానగర్: వరుస భూకంపాలతో అరుణాచల్ప్రదేశ్ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో నాలుగు సార్లు భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. అయితే అదృష్టవశాత్తు ఈ ప్రకంపనల వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. అరుణాచల్ప్రదేశ్లో శుక్రవారం వెనువెంటనే మూడు భూకంపాలు సంభవించిన విషయం తెలిసిందే. తొలుత మధ్యాహ్నం 2.52 గంటల ప్రాంతంలో తూర్పు కమెంగ్ జిల్లాలో 5.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ ప్రభావంతో అసోం, నాగాలాండ్లోని కొన్ని ప్రాంతాల్లో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఆ తర్వాత మధ్యాహ్నం 3.04 గంటల ప్రాంతంలో 3.8 తీవ్రతతో, 3.21 గంటల ప్రాంతంలో 4.9 తీవ్రతతో భూమి కంపించింది. శనివారం తెల్లవారుజామున 4.24 గంటల సమయంలో మరోసారి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.5గా నమోదైంది. తూర్పు కమెంగ్ జిల్లాలో భూమికి 10 కిలోమీటర్ల కేంద్రంలో భూకంప కేంద్రం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఒక్కసారిగా భూమి కంపించడంతో ఆందోళనకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి పరుగులు తీశారు. అయితే ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని అధికారులు ధ్రువీకరించారు.
Mon Jan 19, 2015 06:51 pm