హైదరాబాద్ : ప్రపంచకప్ నుంచి నిష్ర్కమణ తర్వాత టీం ఇండియా వికెట్ కీపర్, బ్యాట్స్మెన్ ఎంఎస్ ధోనీ సెలవులు తీసుకున్న విషయం తెలిసిందే. పారా రిజిమెంటల్ బలగాల్లో లెఫ్టినెంట్ కమాండర్ హోదాలో ఉన్న ధోనీ.. ఆ సైనికులతో కలిసి శిక్షణ తీసుకొనేందుకు రెండు నెలల పాటు సెలవులు పెట్టుకున్నాడు. ఇందుకోసం అతను ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ నుంచి అనుమతి కోరాడు. అయితే ధోనీ ట్రైనింగ్కి రావత్ అనుమతి ఇచ్చారు. కశ్మీర్లో జరిగే ఈ ట్రైనింగ్లో ఇతర సైనికుల విధంగానే ధోనీ శిక్షణ తీసుకోనున్నాడు. అయితే ఎటువంటి ఆర్మీ ఆపరేషన్లలో మాత్రం ధోనీ పాల్గొనేది లేదని ఆర్మీ స్పష్టం చేసింది. ధోనీకి కల్నల్గా ఉన్న బెటాలియన్ ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉంది. 2015లో ఐదు ప్యారాచూట్ జంపింగ్స్ చేసిన ధోనీ ప్యారాట్రూపర్గా అర్హత పొందాడు. ఆగ్రాలోని ఆర్మీ ట్రైనింగ్ క్యాంప్లో అప్పుడు ధోనీ శిక్షణ తీసుకున్నాడు. ఇప్పుడు మరోసారి శిక్షణ కోసం ధోనీ కశ్మీర్కి వెళ్లినట్లు సమాచారం. ప్రపంచకప్ నుంచి ఇండియా నాకౌట్ అయిన తర్వాత ధోనీ రిటైర్మెంట్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే ఆదివారం ధోనీ పేరు లేకుండానే వెస్టిండీస్ పర్యటనకు వెళ్లే టీం ఇండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది. ధోనీ స్థానంలో వన్డేలు, టీ-20లకు వికెట్ కీపర్గా రిషబ్ పంత్ను, టెస్ట్లలో పంత్తో పాటు వృద్ధిమాన్ సాహాలను జట్టులోకి తీసుకుంది. అంతేకాక.. ధోనీ ఇప్పట్లో రిటైర్మెంట్ ప్రకటించడని బీసీసీఐ స్పష్టం చేసింది.
Mon Jan 19, 2015 06:51 pm