న్యూఢిల్లీ: కశ్మీర్ సమస్యపై మధ్యవర్తిత్వం వహిస్తానని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు పార్లమెంట్లో దుమారం రేపుతున్నాయి. దీనిపై ప్రధాని మోడీ సమాధానం ఇవ్వాలని ఇవాళ ప్రతిపక్షాలు పార్లమెంట్లో వాయిదా తీర్మానం కూడా ఇచ్చాయి. లోక్సభలో కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరీ మాట్లాడుతూ.. అమెరికా ముందు భారత్ దాసోహం అయ్యిందన్నారు. మనం బలహీనులం కాదు, దీనిపై ప్రధాని వివరణ ఇవ్వాలని అధిర్ డిమాండ్ చేశారు. అయితే జీరో అవర్లో దీని గురించి చర్చిద్దామని స్పీకర్ అన్నారు. విదేశాంగ మంత్రిత్వశాఖ దీనిపై ప్రకటన చేస్తుందని పార్లమెంటరీ వ్యవహారల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. కశ్మీర్ సమస్యను ఐక్యరాజ్యసమితి వరకు తీసుకు వెళ్లింది ఎవరో తెలుసు అని ఆయన పరోక్షంగా మాజీ ప్రధాని నెహ్రూపై ఆరోపణలు చేశారు. ఇది సీరియస్ అంశమని, ఇందులో రాజకీయాలు ఉండకూడదన్నారు. నిర్మాణాత్మకమైన చర్చ జరగాలని స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. ట్రంప్ కామెంట్పై చర్చ చేపట్టాలని సీపీఐ ఎంపీ డీ రాజా రాజ్యసభలో నోటీసు ఇచ్చారు. మాజీ విదేశాంగ మంత్రి ఎస్ థరూర్ కూడా స్పందించారు. తానేమీ మాట్లాడుతున్నాడో ట్రంప్కు తెలియదని, బహుశా ఆయనకి సమస్య అర్థం కాలేదనుకుంటే, లేదా ఆయనకు సరిగా ఎవరూ చెప్పలేదనుకుంటా అన్నారు. కశ్మీర్ సమస్యపై మధ్యవర్తి వద్దు అన్న విషయం మన విధానం అని, మధ్యవర్తి కోసం మోడీ మరొకర్ని ఆశ్రయించడం అసంభవమే అన్నారు. ఒకవేళ పాక్తో మాట్లాడాలని అనుకుంటే, నేరుగా మాట్లాడాలని శశిథరూర్ అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm