రాయ్పూర్: భర్తల కోసం ప్రాణాలను పణంగా పెట్టిన ఇద్దరు మహిళల విషాద గాథ ఇది. నదిలో కొట్టుకుపోతున్న తమ భర్తలను రక్షించుకునే ప్రయత్నంలో వాళ్లూ ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటన చత్తీస్ గఢ్లోని కొరియా జిల్లాలో ఉన్న బాగనచ్చా జలపాతం సమీపంలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్కు చెందిన మహ్మద్ తాహీర్, పర్వీన్ భార్యాభర్తలు. సతీసమేతంగా తాహీర్ కొరియాలోని అత్తారింటికి వచ్చాడు. పర్వీన్ సోదరుడు నియాజ్ వాళ్లిద్దరినీ పిక్నిక్కు తీసుకెళ్లాడు. నియాజ్ భార్య సన కూడా వారితోపాటు వెళ్లింది. బాగనచ్చా జలపాతాన్ని చూస్తూ ఉండగా... తాహిర్, నియాజ్ నీళ్లలో పడిపోయారు. వాళ్లు నీళ్లలో కొట్టుకుపోతుండగా.. ఏమాత్రం తడుముకోకుండా వదినామరదళ్లు ఇద్దరూ నీళ్లలో దూకేశారు. ఈ ప్రయత్నంలో భర్తలతోపాటూ వాళ్లు కూడా ప్రాణాలు కోల్పోయారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. తీవ్రగాలింపు చేపట్టారు. చివరికి మృతదేహాలను వెలికి తీశారు. ఈ ఏడాది మార్చిలోనే రెండు జంటలకు వివాహమైంది. పెళ్లైన కొన్ని రోజులకే చనిపోవడంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.
Mon Jan 19, 2015 06:51 pm