న్యూఢిల్లీ: సమాచార హక్కు చట్టాన్ని మోడీ సర్కార్ నిర్వీర్యం చేయాలని చూస్తోందని కాంగ్రెస్ నేత, యూపీఏ ఛైర్పర్సన్ సోనియాగాంధీ ఆరోపించారు. చట్టం ప్రతిపత్తిని దెబ్బతీయడమే లక్ష్యంగా కేంద్రం పావులు కదుపుతోందని విమర్శించారు. పదేళ్లలో 60లక్షల మంది సమాచారహక్కు(స.హ) చట్టాన్ని వినియోగించుకున్నారని గుర్తుచేశారు. ప్రభుత్వం తీసుకుంటున్న అసంబద్ధ నిర్ణయాల వల్ల చట్టం పూర్తిగా అంతరించిపోయే ప్రమాదం ఉందన్నారు. సమాచార హక్కు చట్టం-2005ని సుదీర్ఘ చర్చలు, విస్తృత సంప్రదింపులతో రూపొందించామని వివరించారు. దీని ద్వారా ప్రభుత్వంలో పారదర్శకత, జవాబుదారీతనం పెరిగిందన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం సమాచార హక్కు చట్టాన్ని ఒక పీడగా భావిస్తోందని సోనియా ఆరోపించారు. కేంద్ర ఎన్నికల సంఘం, కేంద్ర విజిలెన్స్ కమిషన్తో సమాన హోదా కల్పించిన సమాచార హక్కు కమిషనర్ విధుల్ని ప్రభుత్వం నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తోందన్నారు. సంఖ్యాబలం ఉండడంతో బీజేపీ దీన్ని ఎలాగైనా సాధించాలని చూస్తోందన్నారు. ఈ క్రమంలో పౌరుల హక్కుల్ని హరిస్తున్నారన్న విషయాన్ని మరిచిపోతున్నారన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm