ఆగ్రా: ఎవరైనా తమ పుట్టినరోజును కుటుంబ సభ్యుల మధ్య ఆనందంగా చేసుకోవాలని అనుకుంటుంటారు. కానీ యూపీలోని ఆగ్రాకు చెందిన ఒక వ్యాపారి తన 73వ పుట్టిన రోజును చేసుకున్న విధానాన్ని చూసిన పలువురు అతనిని అభినందనల్లో ముంచెత్తుతున్నారు. వివరాల్లోకి వెళితే మోతీలాల్ యాదవ్ తన పుట్టినరోజు సందర్భంగా జిల్లా జైలులో మగ్గుతున్న 17 మంది ఖైదీలకు విముక్తి కల్పించారు. ఈ ఖైదీల దగ్గర బెయిల్ పొందేందుకు తగినంత డబ్బులేదు. దీనిని గ్రహించిన మోతీలాల్ రూ. 35 వేలు చెల్లించి వారికి బెయిల్ ఇప్పించారు. ఈ సందర్భంగా మోతీలాల్ మాట్లాడుతూ జైలులోని ఖైదీలు బెయిల్ కోసం డబ్బులు చెల్లించలేక ఇబ్బంది పడుతున్నారని తెలిసిందన్నారు. వారికి సాయంచేస్తే భవిష్యత్లో ఎటువంటి తప్పుడు పనులు చేయరని భావించి, వారి బెయిల్కు అవసరమయ్యే సొమ్మును చెల్లించానన్నారు. ఈ విషయాన్ని ఆగ్రా జిల్లా జైలు ఉన్నతాధికారి శశికాంత్ మిశ్రా స్పష్టం చేస్తూ, మోతీలాల్ వీరి బెయిల్ కోసం డబ్బులు చెల్లించిన అనంతరం వారికి విముక్తి కల్పించామన్నారు. ఈ ఉదంతాన్ని తెలుసుకున్నవారంతా సోషల్ మీడియాలో మోతీలాల్ను అభినందిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm