ఛండీగఢ్: జమ్మూకాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే 370 అధికరణను రద్దు చేయడాన్ని భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు సమర్ధించారు. దేశ ఐక్యత, సమగ్రత కాపాడుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఎంతైనా ఉందని, 370వ అధికరణను రద్దు చేసింది కూడా అందుకేనని అన్నారు. ఈ చర్యను మతతత్వ కోణంలో చూడరాదని, దేశ భద్రతకు సంబంధించిన అంశంగానే చూడాలని పేర్కొన్నారు. 370 అధికరణ తాత్కాలిక వెసులుబాటే. భారతదేశ అంతర్గత వ్యవహారాల్లో ఏ ఒక్కరి జోక్యాన్ని మనం అనుమతించేది లేదు అని ఉపరాష్ట్రపతి స్పష్టం చేశారు. ఛండీగఢ్లోని పంజాబ్ యూనివర్శిటీలో జరిగిన బలరామ్జీ దాస్ టాండన్ తొలి స్మారకోపన్యాసంలో వెంకయ్యనాయుడు తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు. 370 అధికరణ రద్దుతో యావత్ దేశం ఆనందంగా ఉందన్నారు. దేశ ఐక్యత, సమగ్రత, భద్రతకు సంబంధించిన అంశం ఇదని, అయితే కొందరు పాశ్చాత్య దేశాలకు చెందిన మీడియా వాళ్లు మాత్రమే 370 అధికరణపై తప్పుదారి పట్టించే ప్రచారం సాగిస్తున్నారని ఆయన ఆరోపించారు.
Mon Jan 19, 2015 06:51 pm