ఇస్లామాబాద్: జమ్మూకాశ్మీర్కు ప్రత్యేక హోదా విషయంలో భారత్ తీసుకున్న నిర్ణయంపై పాక్ రగిలిపోతూనే ఉంది. బుధవారం పాక్ స్వాతంత్ర్య దినోత్సవం సాక్షిగా తన అక్కసును మరోసారి వెళ్లగక్కింది. జమ్మూకాశ్మీర్ ప్రజలకు సంఘీభావం తెలిపింది. కాశ్మీరీలకు తమ బాసట కొనసాగుతూనే ఉంటుందని పాక్ అధ్యక్షుడు అరిఫ్ అల్వీ అన్నారు. పాక్ స్వాతంత్ర్య దినోత్సవాన్ని కాశ్మీర్ సంఘీభావ దినోత్సవంగా పాటిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇస్లామాబాద్లోని కన్వెన్షన్ సెంటర్లో జరిగిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో అరిఫ్ అల్వీ మాట్లాడుతూ.. తమ కాశ్మీర్ సోదరులకు బాసటగా పాక్ ప్రజలు ఏవిధంగా నిలవనున్నారోనని ప్రపంచమంతా ఆసక్తిగా చూస్తోందని చెప్పారు. ఏ దశలోనూ వారిని ఒంటరిని చేయం. కాశ్మీరీలు మనవాళ్లు. వాళ్ల బాధే మన బాధ. వారికి వెన్నుదన్నుగా నిలబడాలన్న వైఖరిని కొనసాగిస్తూనే ఉంటాం అని అల్వి స్పష్టం చేశారు. కాగా, కాశ్మీర్ సంఘీభావ దినోత్సవం థీమ్తో ప్రత్యేక లోగోను పాక్ రూపొందించింది. దానిపై ఎరుపు రంగు అక్షరాలతో కాశ్మీర్ బనేగా పాకిస్థాన్ నినాదం ముద్రించింది.
Mon Jan 19, 2015 06:51 pm