లక్నో: ఉత్తరప్రదేశ్లోని సుల్తాన్పూర్లో ఘోరం జరిగింది. స్కూల్ నుంచి ఇంటికి తిరిగొస్తున్న బాలికపై కొందరు దుండగులు దారుణానికి పాల్పడ్డారు. ఆగస్టు 8న సదరు బాలిక సైకిల్ పై ఇంటికి తిరిగొస్తుండగా..బైక్పై వచ్చిన ముగ్గురు యువకులు ఆమెను అడ్డగించారు. అసభ్యకర పదజాలంతో ఆమెను వేధించసాగారు. ఇది గమనించిన చుటుపక్కల వారు..యువకులపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో వారు అక్కడినుంచి జారుకున్నారు. పరిస్థితి సద్దుమణిగిన అనంతరం వారు మళ్లా వెనక్కొచ్చారు. వారిలో ఇద్దరు ఆమెను కదలకుండా రోడ్డుపై పడుకోబెట్టగా..మూడో వ్యక్తి బాలిక తలపై నుంచి బైక్ తోలాడు. దీంతో ఆమె తల పగిలిపోయి తీవ్ర రక్తస్రావం అయింది. ఈ దారుణాన్ని గమనించిన కొందరు అక్కడికి చేరుకుని బాలికను ఆసుపత్రికి తరలించారు. ఈలోపు..ఆ ముగ్గురు యవకులు అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించగా..కేసు నమోదు చేసేందుకు వారు నిరాకరించారని బాలిక బంధువులు ఆరోపించారు. ఎఫ్ఐఆర్ నమోదు కాకపోవడంతో చికిత్స అందించేందుకు ప్రభుత్వ వైద్యులు నిరాకరించారని, గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆమెను ప్రైవేటు ఆసుపత్రికి తరలించామని బాలిక తాత వాపోయారు. అయితే పోలీసులపై ఒత్తిడి ఎక్కువకావడంతో ఎట్టకేలకు ఆగస్టు 11న కేసు నమోదు చేశారు. కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలిక మూడు రోజుల క్రితం ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్లో కలకలం రేగగా..పోలీసులు నిర్లక్ష్యం పట్ల సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.
Mon Jan 19, 2015 06:51 pm