చెన్నై : సేలంలో సీఎం కాన్వాయ్ని అడ్డుకునేందుకు మహిళలు యత్నించిన సంఘటన కలకలం రేపింది. సేలం జిల్లాలో గత మూడు రోజులుగా పర్యటిస్తున్న ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి పలు కొత్త పథకాలను ప్రారంభించడంతో పాటు, కొత్త పనులకు శంకుస్థాపన, లబ్ధిదారులకు సంక్షేమ సహాయాలను పంపిణీ చేస్తున్నారు. జిల్లాలోని ఏర్కాడు నియోజకవర్గ పరిధిలో వున్న వాలప్పాడిలో ప్రజల నుంచి వినతిపత్రాలను స్వీకరించే కార్యక్రమం జరిగింది. ఇందులో ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి పాల్గొని ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో చెన్నై-సేలం 8 రహదారుల పథకం వల్ల నష్టపోయే చిన్నగౌండాపురం, రామలింగపురం తదితర ప్రాంతాలకు చెందిన వందమందికి పైగా మహిళలు సీఎంను నేరుగా సంప్రదించి వినతిపత్రం అందజేసేందుకు వాలప్పాడికి వాహనాల్లో బయలుదేరారు. వారు పిన్నంపల్లి ప్రాంతానికి చేరుకున్న సమయంలో వాహనతనిఖీల్లో పాల్గొన్న పోలీసులు అడ్డుకున్నారు. ఇందుకు ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళలు సీఎంను చూసేందుకు తమకు అవకాశం కల్పించకపోతే ఆయన కాన్వాయ్ని అడ్డుకుని ఆందోళన చేపడతామని హెచ్చరించారు. దీంతో పోలీసులు వారిని లాఠీలతో బెదిరించి అక్కడి నుంచి తరిమి వేశారు. దీంతో పోలీసుల వైఖరిని ఖండిస్తూ ఆ మహిళలు రోడ్డుపై బైఠాయించి పెద్దఎత్తున నినాదాలు చేశారు. దీనిపై వారు మాట్లాడుతూ, చెన్నై - సేలం 8 రహదారుల పథకాన్ని ప్రవేశపెడితే తాము తీవ్రంగా నష్టపోతామని, దీనికి వ్యతిరేకంగా పలు జిల్లాల్లో చేపడుతున్న ఆందోళనలను ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు.
Mon Jan 19, 2015 06:51 pm