న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలోని నోయిడా - గ్రేటర్ నోయిడాలో వాహనాల తనిఖీ నేపధ్యంలో ఒక విచిత్ర ఉదంతం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే నోయిడా సెక్టార్-62 సమీపంలో ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రిఫ్లక్టర్ లేని కారు కనిపించడంతో దానిని అడ్డుకుని కారు యజమానిని ఈ విషయమై ప్రశ్నించారు. అతని సమాధానం సంతృప్తికరంగా లేకపోవడంతో వారు కారుకు చలానా విధించారు. దానిని ఆర్టీవో దగ్గర చెల్లించాలని వారు తెలిపారు. దీంతో అతను సాయం కోసం స్నేహితుడిని రమ్మని పిలవడంతో అతను బైక్ మీద వచ్చాడు. అయితే ఈ బైక్పై ఆర్టీఓ దృష్టి పడింది. దానిపై నంబరు లేని విషయాన్ని ఆర్టీఓ అజయ్ మిశ్రా గుర్తించారు. దీంతో ట్రాఫిక్ అధికారులు ఆ యువకుడిని ప్రశ్నించారు. దీనికి సమాధానంగా ఆ యువకుడు తాను రెండు నెలల క్రితమే బైక్ కొనుగోలు చేశానని, ఇంతవరకూ రిజిస్ట్రేషన్ కూడా చేయించలేదని తెలిపాడు. దీంతో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన కింద అధికారులు ఆ యువకుని బైక్ను సీజ్ చేశారు. కాగా ఇటువంటి మరో ఘటన నోయిడాలోని నాలెడ్జ్ పార్క్ దగ్గర కూడా చోటుచేసుకుంది.
Mon Jan 19, 2015 06:51 pm