మేడారం: గిరిజన, శిశు సంక్షేమ శాఖామంత్రిగా ప్రమాణం చేసిన అనంతరం మంత్రి సత్యవతి రాథోడ్ మేడారంలోని అమ్మవార్లను దర్శించున్నారు. అమ్మవార్లకు ఆమె బతుకమ్మ తొలి చీర అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తన తొలి పర్యటన గిరిజన ప్రాంతంలో జరపడం, మహిళలకు సంబంధించి, అత్యంత ఇష్టంగా జరుపుకునే బతుకమ్మ పండగ చీరల పంపిణీతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ఆనందించదగ్గ విషయం. గిరిజన తండాలో పుట్టి, పెరిగిన తనకు ముఖ్యమంత్రి మంత్రివర్గంలో స్థానం కల్పించడం, అదనపు భాద్యతను పెంచిందని ఆమె అన్నారు. సీఎం నమ్మకాన్ని నిలబెట్టాలనే కోరికతో మేడారం సమ్మక్క-సారలమ్మ ఆశీర్వాదం తీసుకొని, బతుకమ్మ తొలి చీరలను అమ్మవార్లకు సమర్పించానన్నారు. అమ్మవార్లకు చీరలు సమర్పించిన అనంతరం ఆమె ములుగులో చీరల పంపిణీ కార్యక్రమానికి హాజరవుతారు.
Mon Jan 19, 2015 06:51 pm