హైదరాబాద్: శాసన మండలికి తెలంగాణ సీఎం కేసీఆర్ కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. శాసనసభలో లెవనెత్తలేని అంశాలపై మండలిలో స్పష్టత ఇచ్చే అవకాశం ఉంటుందన్న విషయాన్ని గుర్తు చేశారు. మండలిలో కేవలం ఆర్ధికమంత్రితోనే సరిపెట్టడం సరికాదని.. అనేక అంశాలపై మండలిలో సరైన సమాధానాలు లభించలేదని మండిపడ్డారు. సీఎం సభకు వచ్చి ఉంటే ఆ అంశాలకు స్పష్టత వచ్చేదన్నారు. ఎస్టీ రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదని జీవన్రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రం ఏర్పడ్డనాటి నుంచి గిరిజనులు 720 మెడికల్ సీట్లు నష్టపోయారన్నారు. టెట్ పరీక్ష నిర్వహించకపోవడం దురదృష్టకరమన్నారు. పంటరుణాలపై ఆరు శాతం వడ్డీ రాయితీ రైతులకు అందడం లేదని.. గడచిన ఆరేళ్లలో గల్ఫ్ బాధితులకు ఆర్థిక సాయం అందలేదని.. తక్షణమే ప్రభుత్వం ఈ విషయాలపై చొరవ తీసుకోవాలని జీవన్రెడ్డి డిమాండ్ చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm