పాట్నా: ఆన్లైన్లో మోసాల గురించి తరచూ వార్తలు వస్తున్నప్పటికీ కొందరు తెలిసి తెలిసి వాటి బారిన పడుతూనే ఉన్నారు. అందుకు నిదర్శనమే ఈ ఘటన. రూ.100 రీఫండ్ కోసం ప్రయత్నించిన ఓ వ్యక్తి ఏకంగా రూ. 77వేలు పోగొట్టుకున్నాడు. బీహార్ రాజధాని పట్నాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. పాట్నాకు చెందిన విష్ణు అనే ఇంజినీర్ సెప్టెంబరు 10న జొమాటోలో భోజనం ఆర్డర్ చేశాడు. డెలివరీ బాయ్ వచ్చి పార్శిల్ ఇచ్చాడు. అయితే భోజనం సరిగా లేకపోవడంతో అసంతృప్తి చెందిన విష్ణు దాన్ని తిరిగి తీసుకెళ్లాలని డెలివరీ బాయ్ను కోరాడు. ఇందుకు ఆ వ్యక్తి తాను తీసుకోనని, జొమాటో కస్టమర్ కేర్కు ఫోన్ చేయమని సలహా ఇచ్చాడు. దీంతో విష్ణు గూగుల్ సెర్చ్ చేసి టాప్లో జొమాటో కస్టమర్ కేర్ అని ఉన్న నంబరుకు ఫోన్ చేశాడు. అయితే అది నిజమైన జొమాటో నంబరు కాదు. ఇది తెలియని విష్ణు ఫోన్ మాట్లాడగా.. అవతలి వ్యక్తి తాను జొమాటో కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ అని, భోజనం బాగాలేనందుకు రూ.100 రీఫండ్ ఇస్తామని చెప్పాడు. అయితే ఇందుకోసం రూ.10 డిపాజిట్ చేయాలని అన్నాడు. అనంతరం ఆ వ్యక్తి విష్ణు నంబరుకు ఓ లింక్ పంపాడు. ఆ లింక్ క్లిక్ చేసి విష్ణు తన బ్యాంక్ ఖాతా నుంచి రూ.10 జమ చేశాడు. అయితే కాసేపటికే విష్ణు ఖాతా నుంచి పలు దఫాలుగా రూ.77వేలు మాయమయ్యాయి. మోసపోయా నని గ్రహించిన విష్ణు పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు సైబర్ కేసు నమోదు చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm