తూర్పు గోదావరి : తూర్పు గోదావరి జిల్లా ఆలమూరులో పచ్చని పంట పొలాల్లో మద్యం షాపులకు అనుమతించవద్దని, అధికారులకు వినతినిచ్చినప్పటకీ ఫలితం లేకుండా పోయిందని రైతులు ఆవేదన చెందారు. ఆలమూరు మండలంలోని చొప్పెల్ల మహాలక్ష్మమ్మ ఆలయం ఆవరణలో చేపట్టిన మద్యం షాపు నిర్మాణ పనులను ఆపాలంటూ.. స్థానిక మూలపుంత రైతులు, మహిళలు కలిసి సోమవారం మూడవ రోజు రిలే నిరహార దీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ... ఎన్నడూ లేని విధంగా పచ్చని పొలాల మధ్య మద్యం దుకాణం పెటవద్దని, పలు శాఖల అధికారులకు గడచిన 20 రోజులుగా వినతి ఇచ్చామన్నారు. వారు వెంటనే స్పందించి నిర్మాణంలో ఉన్న షాపును నిలుపుదల చేస్తారని ఎదురు చూశామన్నారు. కానీ అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఆవేదన అధికారులకు తెలియాలనే శాంతియుతంగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నామన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm