బెంగళూరు: కొద్ది రోజుల క్రితమే ఆసియా అత్యున్నత పురస్కారం రామన్ మెగసెసె అవార్డు అందుకున్న సీనియర్ జర్నలిస్టు రవీష్ కుమార్ను మరో పురస్కారం వరించింది. ఉన్మాదుల దాడిలో అసువులు బాసిన జర్నలిస్టు గౌరీ లంకేష్ పేరుపై ఏర్పాటు చేసిన గౌరీ లంకేష్ మెమోరియల్ మొట్టమొదటి అవార్డుకు రవీష్కుమార్ను ఎంపిక చేసినట్లు గౌరీ లంకేష్ మెమోరియల్ ట్రస్ట్ పేర్కొంది. ఈ అవార్డు రావడం పట్ల రవీష్కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఒక గొప్ప జర్నలిస్ట్ పేరుతో ఏర్పాటైన తొట్ట తొలి అవార్డును తాను అందుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ఇండియన్ మీడియా గురించి మాట్లాడుతూ...భారతీయ మీడియా దేశంలో ప్రజాస్వామ్యాన్ని చంపేస్తోంది. ప్రభుత్వాధినేతలను పురాణాల్లోని అవతారాలుగా చిత్రించే ప్రయత్నం చేస్తోంది. అయితే ఇది ప్రజలు గ్రహించరని అనుకోవద్దని అన్నారు. కాగా, రవీష్కుమార్కు అవార్డు ప్రదానం చేసే రోజే మూడు పుస్తకాలను విడుదల చేయనున్నారు. సీనియర్ జర్నలిస్ట్ డీ.ఉమాపతి రాసిన ఢిల్లీ నోటా, రవీష్కుమార్ ఫ్రీ వాయిస్, ప్రొఫెసర్ వినయ ఒక్కుంద రాసిన నీరా నాదే అనే మూడు పుస్తకాలను ఆవిష్కరించనున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm