కోల్కతా: శారదా చిట్ఫండ్ స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న కోల్కతా మాజీ పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ తరఫున ఆయన భార్య ముందస్తు బెయిలు కోసం దరఖాస్తు చేశారు. తన భర్తకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ ఆమె కోల్కతా హైకోర్టును సోమవారంనాడు ఆశ్రయించారు. శారదా చిట్ఫండ్ స్కాములో సాక్ష్యాలను మాయం చేశారనే ఆరోపణలను రాజీవ్ కుమార్ ఎదుర్కొంటున్నారు. ఈ కేసు సీబీఐకి బదిలీ చేయడానికి ముందు ఏర్పాటు చేసిన పశ్చిమబెంగాల్ ప్రత్యేక విచారణ బృందానికి రాజీవ్ కుమార్ సారథ్యం వహించారు. పశ్చిమబెంగాల్ సీఐడీ అడిషనల్ డైరెక్టర్ జనరల్గా ఉన్న కుమార్ ఆచూకీ కొద్దిరోజులుగా తెలియడం లేదు. ఆయన ఫోన్ స్విచ్ఛాప్ అయిందని, ఈ-మెయిల్స్కు స్పందిస్తున్నారని సీబీఐ ఇటీవల కోర్టుకు తెలియజేసింది. ఈ స్కామ్లో కుమార్ను అరెస్టు చేసే హక్కు సీబీఐకి ఉందని కోర్టు చెప్పడంతో గత శనివారంనాడు ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ను స్థానిక కోర్టు తోసిపుచ్చింది. ఇంట్లోనే ఉండాల్సిందిగా కోల్కతా హైకోర్టు ఆదేశాలను కుమార్ ఉల్లంఘించారని, ఆయన ఆచూకీ తెలియకుండా ఉందని కోర్టుకు సీబీఐ విన్నవించింది. శారదా కుంభకోణంలో కుమర్ను పోలీసులు అరెస్టు చేయకుండా కల్పించిన ముందస్తు రక్షణను హైకోర్టు ఈనెల మొదట్లో ఉపసంహరించుకుంది. అప్పట్నించి సీబీఐ ఆయనకు పలుమార్లు సమన్లు జారీ చేసింది. తమ ముందు హాజరుకావాల్సిందిగా సీబీఐ జారీ చేసిన సమన్లను ఆయన బేఖాతరు చేశారు. దీంతో సీబీఐ బృందం ఒకటి కోల్కతాలో ఆయన ఆచూకీ కోసం గాలిస్తోంది
Mon Jan 19, 2015 06:51 pm