హైదరాబాద్ : అమీర్ పేట్ మెట్రో స్టేషన్ లో ప్రమాదవశాత్తు పెచ్చులూడి పడి ప్రాణాలు కోల్పోయిన మౌనిక కుటుంబానికి రూ.20 లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ..అమీర్ పేట్ మెట్రో ఘటనపై రాష్ట్రప్రభుత్వం సీరియస్ అయింది. స్వతంత్ర ఇంజనీరింగ్ నిపుణులు క్షుణ్ణంగా పరిశోధించి..అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ప్రమాదం ఒక విచిత్రమైనదే అయినప్పటికీ చాలా తీవ్రంగా పరిగణించాల్సిన అవసరముంది. అన్ని స్టేషన్ల నిర్మాణాలు, సౌకర్యాలను సూక్ష్మంగా తనిఖీ చేయాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలి. భద్రతకు అన్ని సమయాల్లో అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. మంత్రి కేటీఆర్ సలహా ప్రకారం బాధిత కుటుంబానికి తగిన పరిహారం చెల్లించాలని ఎల్అండ్ టీకి సూచించాం. ఎల్ అండ్ టీ యాజమాన్యం బాధిత కుటుంబసభ్యులతో చర్చలు జరిపింది. బాధిత కుటుంబానికి రూ.20 లక్షలు పరిహారం చెల్లించే ఒప్పందంపై ఎల్ అండ్ టీ సంతకం చేసిందని ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు.
Mon Jan 19, 2015 06:51 pm