హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్పై తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి తీవ్ర విమర్శలు చేశారు. ఓడ ఎక్కేదాకా ఓడ మల్లన్న.. ఒడ్డు దిగాక బోడి మల్లన్న అనే తీరుగా వ్యవహరించే కేసీఆర్ నైజం మరోసారి బట్టబయలైందన్నారు. ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించిన ఓయూ విద్యార్థులను దూరం పెట్టిన కేసీఆర్.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు త్యాగం చేసిన వారి కుటుంబాలనూ గాలికి వదిలేశారని విమర్శించారు. తాజాగా తెలంగాణ ఉద్యమం కోసం ఉద్యోగాలను పణంగా పెట్టి పోరాడిన ప్రభుత్వ ఉద్యోగులను సైతం కించపరుస్తూ కేసీఆర్ కామెంట్లు చేయడం 'దొర' అహంకారానికి అద్దంపడుతోందని విజయశాంతి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వ ఉద్యోగులు తన మాటను లెక్క చేయకపోతే అంతు తేలుస్తామంటూ కేసీఆర్ వార్నింగ్ ఇచ్చే ముందు.. గతంలో సకల జనుల సమ్మె సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు మద్దతుగా ఆయన చేసిన వ్యాఖ్యలను ఒకసారి గుర్తు చేసుకోవాలని సూచించారు. ప్రజలకు ఏమీ చేయకపోయినా వచ్చే 10 ఏళ్ళు కూడా తాను సీఎంగా కొనసాగుతానని ఎవరో కొందరు జ్యోతిష్కులు చెప్పిన విషయాన్ని కేసీఆర్ బాగా నమ్మినట్టు ఉన్నారని ఎద్దేవా చేశారు. ఈ కారణంగానే విద్యార్థుల మద్దతు లేకపోయినా.. ఉద్యోగుల సహకారం లేకపోయినా.. మరో రెండు దఫాలు తానే సీఎం అవుతానని కేసీఆర్ మితిమీరిన విశ్వాసంతో విద్వేష ప్రకటనలు చేస్తున్నారనే అనుమానం కలుగుతోందని వ్యాఖ్యానించారు. అయితే ఎలాంటి జాతకాన్ని అయినా మార్చగలిగే శక్తి ప్రజలకు ఉంటుందన్న విషయాన్ని కేసీఆర్ గుర్తు పెట్టుకుంటే మంచిదని విజయశాంతి హితవుచెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm