ఒంగోలు: 'మావయ్యా, ఈ అనారోగ్యాన్ని నేను తట్టుకోలేను.. ఇన్ని మాత్రలు మింగలేను.. అందరూ నన్ను దోషిగా చూస్తున్నారు.. నేను చనిపోతున్నా., దయ చేసి నా శవాన్ని ఆర్టీసీ బస్టాండు పక్కనే ఉన్న శ్మశాన వాటికలో దహనం చేయండి' అని లేఖ రాసి ఒక యువకుడు బ్లేడుతో గొంతు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హృదయ విదారక ఈ సంఘటన ఒంగోలులో సోమవారం వెలుగు చూసింది. స్థానిక దక్షిణ బైపాస్ రోడ్డులోని కార్గిల్ పెట్రోల్ బంకు సమీపంలో ఉన్న వంతెన వద్ద సోమవారం సాయంత్రం గుర్తు తెలియని యువకుడి మృతదేహం రక్తపు మడుగులో పడి ఉండటాన్ని స్థానికులు గమనించారు. తాలుకా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్స్పెక్టర్ ఎం.లక్ష్మణ్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహం వద్ద ఆత్మహత్యకు ఉపయోగించిన బ్లేడుతో పాటు ఒక లేఖ లభ్యమైంది. వాటి ఆధారంగా మృతి చెందిన వ్యక్తి కొప్పోలు వాసిగా పోలీసులు గుర్తించారు. అతడి కుటుంబీకులకు సమాచారం ఇచ్చి మృతదేహాన్ని రిమ్స్ శవాగారానికి తరలించారు.
Mon Jan 19, 2015 06:51 pm