ఢిల్లీ: అయోధ్య కేసుపై సుప్రీంకోర్టులో విచారణ తుది దశకు చేరుకుంది. నేడు ఈ కేసుపై సర్వోన్నత న్యాయస్థానం తిరిగి విచారణ ప్రారంభించనుంది. మధ్యవర్తిత్వం విఫలమైన నేపథ్యంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఆగస్టు 6నుంచి ఈ కేసుపై రోజువారీ విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ నెల 17తో దీనిపై వాదనలు ముగియనున్నాయి. సోమవారంతో ముస్లిం వర్గాల వాదనలు పూర్తవనుండగా ఈ నెల 16తో హిందూ వర్గాల వాదనలు ముగించాలని ధర్మాసనం సూచించింది. నవంబర్ 17న దీనిపై తీర్పు వెలువరించనున్నారు. అదే రోజు రంజన్ గొగొయి పదవీ విరమణ పొందనుండడం గమనార్హం. అతి సున్నితమైన ఈ కేసులో సుప్రీం విచారణ ముగుస్తుండటం త్వరలో తీర్పు వెలువడనున్న నేపథ్యంలో అయోధ్యలో 144 సెక్షన్ విధించారు. డిసెంబర్ 10 వరకు ఆంక్షలు కొనసాగుతాయని జిల్లా మెజిస్ట్రేట్ అనూజ్ కుమార్ ఝా తెలిపారు.