అహ్మద్నగర్: రాష్ట్రస్థాయి రైఫిల్ షూటింగ్ టోర్నమెంట్లో తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఆసిఫ్నగర్-1 బాలుర వసతి గృహం విద్యార్థి సయ్యద్ ముదస్సిర్ హుస్సేన్ బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు. 65వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడల్లో భాగంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ షూటింగ్ రేంజ్లో మూడు రోజులపాటు నిర్వహించిన ఈ పోటీలు ఆదివారంతో ముగిశాయి. ఇందులోభాగంగా ఆసిఫ్నగర్ బాలుర పాఠశాలలో 9వ తరగతికి చెందిన ముదస్సిర్ హుస్సేన్ 400 మంది విద్యార్థులు పాల్గొన్న ఈ విభాగంలో సత్తాచాటి తొలిస్థానంలో నిలవడమే గాక జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించాడు. పాఠశాలకు రాష్ట్రస్థాయిలో బంగారు పతకాన్ని సాధించిన విద్యార్థి ముదస్సిర్తోపాటు బాలుడి తండ్రి ఆజాద్ హుస్సేన్లను ఆదివారం రాత్రి పాఠశాల ప్రిన్సిపాల్ సయ్యద్ తాజుద్దీన్, వార్డెన్ రాజ్ అహ్మద్ అభినందించారు.
Mon Jan 19, 2015 06:51 pm