బేగంపేట: చిత్తు కాగితాలు ఏరుకునే ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు నాలాలో పడి గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న రాంగోపాల్పేట పోలీసులు గల్లంతైన వ్యక్తి కోసం గాలించగా ఆచూకీ లభించలేదు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సమీర్(35), రాజు అనే ఇద్దరు స్నేహితులు ఫుట్పాత్లపై నివసిస్తూ చిత్తు కాగితాలు ఏరుకొని వాటిని విక్రయిస్తూ వచ్చే ఆదాయంతో జీవనం సాగిస్తుంటారు. ఆదివారం సాయంత్రం 5గంటల సమయంలో ఇద్దరు మద్యం సేవించి చిత్తు కాగితాలు ఏరుకునేందుకు నెక్లెస్రోడ్డులోని గాంధీ విగ్రహం వద్దకు వచ్చారు. సమీర్ నాలా పక్కనే కాగితాలు ఏరుకుంటూ నాలాలో పడిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి గాలింపు చర్యలు చేపట్టారు. సైఫాబాద్ ఏసీపీ వేణుగోపాల్రెడ్డి, రాంగోపాల్పేట ఇన్స్పెక్టర్ సీహెచ్.బాబు, ఎస్ఐలు, సిబ్బంది గల్లంతైన వ్యక్తి కోసం వివరాలు సేకరించారు. చీకటి పడేంత వరకు సమీర్ ఆచూకీ కోసం గాలించినా ఫలితంలేకపోయింది. సోమవారం ఉదయం మరోమారు గాలించనున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన పంజాగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో ఉండటంతో వారికి సమాచారం అందించినట్లు రాంగోపాల్పేట పోలీసులు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm