హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని కోర్టు చెబుతుంటే.. సీఎం కేసీఆర్ మాత్రం షరతులు పెడుతున్నారంటూ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు మండిపడ్డారు. విలీనం డిమాండ్ను ఆర్టీసీ కార్మికులు వదులుకోలేదని అన్నారు. చర్చలంటే అన్ని డిమాండ్లపై చర్చించాల్సిందేనని అన్నారు. ఒకవైపు చర్చలు జరపాలని అధికారులతో సీఎం చెబుతూ.. మరోవైపు ప్రైవేటు బస్సుల కోసం నోటీసులు ఇస్తున్నారని వీహెచ్ మండిపడ్డారు. ముఖ్యమంత్రికి చర్చలపై చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ప్రభుత్వం 26 డిమాండ్లపై చర్చలు జరపాల్సిందేనని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. విలీనం డిమాండ్ను తాము వదులుకుంటున్నట్లు ఎప్పుడు.. ఎక్కడ చెప్పలేదన్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న కేసీఆర్ అబద్దాలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు 26 డిమాండ్లు ప్రాధాన్యమని, ముందు చర్చలు జరపాలని అశ్వత్థామరెడ్డి కోరారు. ధనిక రాష్ట్రమని చెబుతున్న కేసీఆర్.. ఆ ధనమంతా ఎక్కడికి పోయిందని ఆయన ప్రశ్నించారు.
Mon Jan 19, 2015 06:51 pm