న్యూఢిల్లీ: దేశ ఆర్థిక, సామాజిక పరివర్తనలో రాజ్యసభ అత్యంత కీలక పాత్ర నిర్వహించిందని ప్రధాని మోడీ అన్నారు. రాజ్యసభ 250వ సమావేశం జరుగుతున్న చారిత్రక క్షణాలివి అని అన్నారు. పెద్దల సభ సభ్యులందరికీ ఆయన ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. రాజ్యసభ 250వ సమావేశం సందర్భంగా సోమవారంనాడు సభలో జరిగిన ప్రత్యేక చర్చను ప్రధాని ప్రారంభిస్తూ, ఎన్నో చారిత్రక సందర్భాలకు రాజ్యసభ సాక్షీభూతంగా నిలిచిందని, చరిత్ర సృష్టించిందని, ఎంతో దూరదృష్టి కలిగిన సభ ఇదని ఆయన కొనియాడారు. భిన్నత్వానికి ప్రతీక రాజ్యసభ అని, కాలానుగుణంగా సభ ఔన్నత్యం పెరగడంతో పాటు సభ్యులు దేశ ఔన్నత్యాన్ని ఎంతో పెంచుతూ వచ్చారని ప్రధాని అన్నారు. ఇక్కడే ఎన్నో బిల్లులు ఏకాభిప్రాయంతో ఆమోదం పొందాయని అన్నారు. దేశానికి మేలు చేయాల్సి వచ్చినప్పుడల్లా రాజ్యసభ తన ప్రత్యేకతను చాటుకుంటూనే ఉందన్నారు. ప్రధాని తన ప్రసంగంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ సేవలను కూడా గుర్తుచేశారు.
Mon Jan 19, 2015 06:51 pm