హైదరాబాద్: ఆస్పత్రిలో నిరాహార దీక్ష కొనసాగిస్తున్న ఆర్టీసీ కార్మిక సంఘాల ఐకాస నేతలు అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి మధుమేహంతో బాధపడుతున్నారని.. ఈ సమయంలో ఆహారం తీసుకోకపోతే ఇద్దరి ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని ఉస్మానియా ఆస్పత్రి ఆర్ఎంవో రఫీ తెలిపారు. దీక్ష విరమించి ఆహారం తీసుకోవాలని వారిని కోరినట్లు చెప్పారు. ప్రస్తుతం షుగర్, బీపీ స్థాయులు బాగా పెరిగిపోయాయని..సెలైన్స్, ఫ్లూయిడ్స్ ఎక్కిస్తున్నట్లు ఆయన వివరించారు. మరోవైపు అశ్వత్థామ, రాజిరెడ్డిలను సీపీఐ మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆస్పత్రిలో పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపకుండా సీఎం కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్కు భయంపట్టుకుందని.. ఆయన అభద్రతా భావంలో ఉన్నారని కూనంనేని విమర్శించారు. రేపటి సడక్బంద్కు సీపీఐ సంపూర్ణ మద్దతు తెలుపుతోందన్నారు. అన్ని వర్గాల ప్రజలు సడక్ బంద్లో పాల్గొనాలని కూనంనేని పిలుపునిచ్చారు.
Mon Jan 19, 2015 06:51 pm