హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిష్కరించలేమని అడిషనల్ ఏజీ రాంచందర్రావు హైకోర్టుకు తెలిపారు. కార్మికులు చట్ట ప్రకారం నడుచుకోలేదని, ఆర్టీసీ సమ్మె చట్ట విరుద్ధమని ఏజీ కోర్టుకు తెలిపారు. 'ఆర్టీసీ నష్టాల్లో ఉంది కాబట్టే ప్రభుత్వం ఆర్థికంగా ఎంతగానో ఆదుకుంది. ఆర్టీసీ కార్పొరేషన్ పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయింది. ఆర్థిక పరిస్థితి అస్సలు బాగాలేదు. కార్మికుల ఆర్థికపరమైన డిమాండ్లు నెరవేర్చలేం. సమ్మె కారణంగా ఇప్పటి వరకు ఆర్టీసీ కార్పొరేషన్ 44శాతం నష్టపోయింది. ఇక ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపలేం. యూనియన్ నేతలు విలీనం డిమాండ్ను తాత్కాలికంగా పక్కన పెట్టినా తిరిగి ఏ క్షణమైనా మళ్లీ ఆ డిమాండ్ను తీసుకొచ్చి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే అవకాశం ఉంది. కొంతమంది యూనియన్ నేతలు తమ స్వార్థం కోసం మొత్తం సంస్థనే నష్టాల్లోకి నెడుతున్నారు. యూనియన్ నేతలు పనిగట్టుకుని ప్రతిపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని కష్టాల్లోకి నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. పారిశ్రామిక వివాదాల చట్టం సెక్షన్ 22(1)ఏ ప్రకారం సమ్మె చట్ట విరుద్ధం. సమ్మెకు వెళ్లేముందు కార్మికులు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు.' అని ఏజీ కోర్టుకు విన్నవించారు.
Mon Jan 19, 2015 06:51 pm