హైదరాబాద్ : రహదారిపై మొక్కలు నాటి, నీరు పోయడం ద్వారా కొంత మంది యువకులు వార్తల్లో ప్రముఖంగా నిలిచారు. అధికారుల తీరుతో విసిగిపోయి హైదరాబాద్లోని ఫీర్జాదిగూడలో రోడ్లపై ఏర్పడిన గుంతల్లో మొక్కలు నాటి నీళ్లు పోశారు. అది హరితహారం కార్యక్రమం కాదు. గుంతలమయమైన రోడ్డు మరమ్మతుకు నోచుకోకపోవడంతో ఆ యువకులు అలా నిరసన తెలిపారు. ఉప్పల్ పరిధిలోని ఫీర్జాదిగూడలో హైదరాబాద్-వరంగల్ ప్రధాన రహదారిపై యువకులు చేపట్టిన ఈ నిరసన కార్యక్రమం పలువురి దృష్టిని ఆకర్షించింది. అధికారుల తీరుతో విసుగు చెంది ఈ దారి ఎంచుకున్నట్లు వారు తెలిపారు. రోడ్డు దెబ్బతినడంతో కొంత కాలంగా తీవ్ర అవస్థలు పడుతున్నట్లు బృందంలోని ప్రశాంత్ తెలిపాడు. సెప్టెంబర్ నుంచి అధికారులను పలుమార్లు కలిసి రహదారి మరమ్మతు చేయాలని విజ్ఞప్తి చేసినట్లు అతడు చెప్పాడు. వర్షాకాలం ముగిసిపోయినా.. రోడ్లు మరమ్మతుకు నోచుకోలేదని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రశాంత్తో పాటు మరో ఇద్దరు యువకులు, ఓ యువతి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm