హైదరాబాద్ : అడవి చూడడానికి వెళ్లిన ఓ టూరిస్ట్ గ్యాంగుకు ఏనుగులు చుక్కలు చూపించాయి. తమిళనాడుకు చెందిన కొంత మంది అభయారణ్యం పర్యటనకు వెళ్లారు. ఇంతలో అక్కడికి ఒక్కసారిగా 50 ఏనుగులు వచ్చాయి. వాటిని చూడగానే వారు భయపడటం మానేసి ముచ్చటపడి సెల్ఫీలు తీసుకోవాలని ఉబలాటపడ్డారు. ఫోన్లు తీసుకుని ఓ ఏనుగు వద్దకు వెళ్లారు. సెల్ఫీ ప్రతయ్నం చేశారు. ఇంతలో ఆ ఏనుగు వారిపై దాడికి యత్నించింది. ఏనుగు కోపాన్ని గ్రహించి వారంతా పరుగులు తీశారు. ఇంతలో ఓ వ్యక్తి కింద పడిపోయాడు. అతడు లేచి పరిగెత్తబోతుండగా ఏనుగు తన తొండంతో నెట్టింది. ఆ వ్యక్తి కాస్త దూరంలో పడి లేచి మళ్లీ పరిగెత్తాడు. ఏనుగు అతడిని వెంబడించింది. చావు నోట్లో తలపెట్టినంత పనే అయింది అతని పరిస్థితి. ఎలాగోలా ఏనుగు బారి నుంచి తప్పించుకున్నాడు. ఏనుగు దెబ్బకు అందరూ చల్లని చెమట్లు తుడుచుకుంటూ అక్కడినుంచి తిరుగుటపా కట్టారు.
Mon Jan 19, 2015 06:51 pm