పుణె: రైల్లో సీటు కోసం జరిగిన వివాదంలో 26 ఏళ్ల వ్యక్తిని ఆరుగురు మహిళలతో సహా 12 మంది కొట్టడంతో అతను ప్రాణాలు కోల్పోయిన ఘటన ముంబై-లాతుర్-బీదర్ ఎక్స్ప్రెస్లో చోటుచేసుకొంది. రైల్వే ఎస్పీ దీపక్ సతోరే తెలిపిన వివరాల ప్రకారం... గురువారం ఉదయం కళ్యాణ్ ప్రాంతానికి చెందిన సాగర్ మార్కండ్ అనే వ్యక్తి తన భార్య జ్యోతి, రెండేళ్ల కుమార్తెతో కలిసి షోలాపూర్ జిల్లాలోని కుర్దువాడి వెళ్లేందుకు కళ్యాణ్లో రైలు ఎక్కాడు. జనరల్ బోగీలో రద్దీ ఎక్కువగా ఉండటంతో పాపను ఎత్తుకున్న తన భార్య కూర్చునేందుకు సీటు సర్దుబాటు చేసుకోవాలని కూర్చున్న మహిళలను కోరాడు. దీనికి అంగీకరించని మహిళలు సాగర్తో వాగ్వివాదానికి దిగారు. క్రమంగా అది ఘర్షణకు దారి తీయడంతో మహిళలతో ఉన్న వారు 12 మంది సాగర్ను తోసివేస్తూ తీవ్రంగా కొట్టారు. వారిని సాగర్ భార్య జ్యోతి వారిస్తున్నా వినకుండా గంటపాటు అతణ్ని చితకబాదారు. అలా వారు రైలు పుణె నుంచి తర్వాతి స్టేషన్ దౌండ్ చేరుకునే వరకూ కొడుతూనే ఉన్నారు. దౌండ్ స్టేషన్లో రైల్వే పోలీసులు సాగర్ను ఆస్పత్రి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి ఆరుగురు మహిళలను, నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని, విచారణ జరుపుతున్నట్లు దీపక్ సతోరే తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm