బెంగళూరు: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌర పట్టిక (ఎన్ఆర్సీ)లకు వ్యతిరేకంగా పద్యం రాసినందుకు ఓ కవిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు ఓ ఎడిటర్ను సైతం అరెస్ట్ చేశారు. సిరాజ్ బిసరల్లి అనే కవి గత నెలలో సీఏఏకు వ్యతిరేకంగా ఓ పద్యం రాశారు. దాన్ని కన్నడనెట్.కామ్ అనే వెబ్సైట్లో పోస్ట్ చేశారు. ఈ వెబ్సైట్కు రాజబక్షి ఎడిటర్గా పని చేస్తున్నారు. అయితే ఈ పద్యంపై ఫిర్యాదు రావడంతో ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కర్నాటకలోని గంగావతి జిల్లాలో జనవరి 14న కన్నడ కల్చర్ అండ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అనెగుండి ఉత్సవం అనే కార్యక్రమంలో బిసరల్లి ఈ పద్యాన్ని పఠించారు. దీనిని రజబక్ష అదే రోజున సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అనంతరం, బీజేపీ యువ మోర్చా నాయకుడు శివు అరకేరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇద్దరినీ అరెస్ట్ చేశారు. వీరిపై భారత శిక్షా స్మృతిలోని సెక్షన్ 505 ప్రకారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm