హైదరాబాద్ : సస్పెన్స్ థ్రిల్లర్ గా 'వలయం' సినిమా రూపొందింది. కొంతకాలం క్రితం 'నీతో వస్తా' చిత్రంతో తెలుగు తెరకి హీరోగా పరిచయమైన 'లక్ష్' .. కొంత గ్యాప్ తరువాత చేసిన చిత్రం ఇది. ఈ సినిమాతో దర్శకుడిగా రమేశ్ కదుముల పరిచయమవుతున్నాడు. దిగాంగన కథానాయికగా నటించిన ఈ సినిమా, ఈ నెల 21వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డువారు ఈ సినిమాకి యూ/ఎ సర్టిఫికెట్ ను మంజూరు చేశారు. శేఖర్ చంద్ర అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని అంటున్నారు. తన భార్య కనిపించకుండా పోవడంతో హీరో ఏం చేస్తాడు? ఆమె హఠాత్తుగా అదృశ్యం కావడం వెనుక కారకులు ఎవరు? అనే ఆసక్తికరమైన మలుపులతో ఈ సినిమా సాగుతుందట. ఈ సినిమా ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి మరి.
Mon Jan 19, 2015 06:51 pm