న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా రెండు నెలలుగా సాగిస్తున్న నిరసనలకు తెరదించేందుకు సుప్రీంకోర్టు నియమించిన మధ్యవర్తుల బృందం షహీన్బాగ్ నిరసనకారులను బుధవారంనాడు కలుసుకుంది. ఆమోదయోగ్యమైన పరిష్కారం కోసం చేస్తున్న ప్రయత్నంలో భాగంగా మధ్యవర్తులు సంజయ్ హెగ్డే, సాధనా రామచంద్రన్లు నిరసనకారులతో మాట్లాడారు. నిరసనలు తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని సుప్రీంకోర్టు పేర్కొన్న విషయాన్ని నిరసనకారులకు సుధారామచంద్రన్ గుర్తు చేస్తూ, ఇతరులకు కూడా రోడ్లను ఉపయోగించుకునే హక్కు, దుకాణాలు తెరుచుకునే హక్కు ఉంటుందని వివరించారు. నిరసనలు తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని సుప్రీం కోర్టు చెప్పినందున తాము ప్రతి ఒక్కరి వాదనను వినేందుకు ఇక్కడకు వచ్చామని నిరసనకారులను ఉద్దేశించి సంజయ్ హెగ్డే, సాధనా రామచంద్రన్ పేర్కొన్నారు. రోడ్ల దిగ్బంధాలకు తావులేని ప్రత్యామ్నాయ స్థలాన్ని నిరసనకారులు ఎంచుకోవాలని సుప్రీంకోర్టు సూచిన నేపథ్యంలో మధ్యవర్తులు ఈ సమావేశం జరిపారు. షహీన్బాగ్ నిరసనకారులతో సమావేశానికి ముందు అడ్వకేట్ సంజయ్ హెగ్డే మీడియాతో మాట్లాడుతూ, అందరి సహకారంతో ఒక పరిష్కారం లభిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే తాము మధ్యవర్తిత్వం నెరుపుతున్నామని, అందరితోనూ మాట్లాడి, పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm