హైదరాబాద్: అసలు పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోతూ వ్యాను ఢీకొని నకిలీ పోలీసు అధికారి దుర్మరణం చెందిన ఘటన తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాలో చోటు చేసుకుంది. పల్లడం వద్ద ఓ యువకుడు పోలీసు దుస్తులు ధరించి ద్విచక్ర వాహన తనిఖీలు చేపట్టాడు. వాహనదారులతో తాను ఎస్సైగా చెప్పుకున్నాడు. సరైన పత్రాలు లేని వాహనదారుల వద్ద డబ్బులు వసూలు చేశాడు. అతని వాలకం పట్ల అనుమానంతో స్థానికులు...వాహన తనిఖీలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అక్కడకు చేరుకుని ఆ యువడిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నింగా...ఆ యువకుడు తన బైక్లో అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయేందుకు ప్రయత్నించాడు. పోలీసులు వెంబడించడంతో బైక్లో వేగంగా వెళ్లిన ఆ యువకుడు...ఓ వ్యానును ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు పోలీసులు. మృతుడిని అజిత్ కుమార్(23)గా గుర్తించిన పోలీసులు...అతను పోలీసు దుస్తులు ధరించి చాలా రోజులుగా ఇలా వాహన తనిఖీల పేరిట వసూళ్లకు పాల్పడుతున్నట్లు నిర్ధారించారు. ఇంజనీరింగ్ వరకు చదువుకున్న అతను..పోలీసు ఉద్యోగం కోసం ప్రయత్నించి విఫలంకావడంతో ఇలా నకిలీ ఎస్సై అవతారమెత్తినట్లు స్థానికులు చెబుతున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm