హైదరాబాద్: నల్గొండలో స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో పంచాయతీ రాజ్ సమ్మేళనం జరిగింది. ఆ కార్యక్రమానికి మంత్రి జగదీశ్ రెడ్డితో పాటు నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి (టీఆర్ఎస్), మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (కాంగ్రెస్) హాజరయ్యారు. సభా వేదికపై కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పథకాలను వివరించారు. ఆ క్రమంలో గత ప్రభుత్వాల హయాంలో అభివృద్ధే లేకుండా పోయిందని విమర్శలు గుప్పించారు. అక్కడే వేదికపై ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ కలగజేసుకొని భూపాల్ రెడ్డి వ్యాఖ్యల్ని తప్పుబట్టారు. నిజానికి కాంగ్రెస్ హయాంలోనే పథకాలు అమలయ్యాయని.. టీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో అక్కడా అమలు కావడం లేదని విమర్శించారు. ఆ వ్యాఖ్యలపై భూపాల్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. వేదికపై మంత్రి జగదీశ్ రెడ్డి ముందే ఇరువురు నేతలు ఫైట్ చేశారు. ఒకరిపైకి మరొకరు దూసుకెళ్లడంతో అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకొని శాంతింపజేశారు. అదే సమయంలో ఇరువర్గాల కార్యకర్తలు తమ పార్టీకు అనుకూలంగా, ప్రత్యర్థి పార్టీకి వ్యతిరేకంగా పోటాపోటీగా నినాదాలు చేశారు. పోలీసులు వారించడంతో అక్కడ గొడవ సద్దుమణిగింది.
Mon Jan 19, 2015 06:51 pm