హైదరాబాద్ : ఉత్తరప్రదేశ్లో మరో బీజేపీ ఎమ్మెల్యేపై లైంగికదాడి కేసు నమోదైంది. ఎమ్మెల్యే రవీంద్ర నాథ్ త్రిపాఠి, ఆయన అనుచరులు ఆరుగురు కలిసి తనపై లైంగికదాడి చేశారంటూ ఓ మహిళ(40) పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ఎమ్మెల్యే రవీంద్ర నాథ్ త్రిపాఠితో పాటు మరో ఆరుగురిపై లైంగికదాడి కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భదోహి ఎమ్మెల్యే త్రిపాఠి తన అనుచరులతో కలిసి 2017లో నెల రోజుల పాటు బంధించి తనపై పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డారంటూ బాధిత మహిళ(40) ఫిబ్రవరి 10న ఫిర్యాదు చేసిందని ఎస్పీ రామ్ బదన్ సింగ్ తెలిపారు. ఆమె గర్భం దాల్చడంతో బలవంతంగా అబార్షన్ కూడా చేయించినట్లు బాధిత మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ కేసు విచారణను ఏఎస్పీ రవీంద్రను నియమించామని, తాజాగా కేసుకు సంబంధించి నివేదికను ఏఎస్పీ సమర్పించారని ఎస్పీ తెలిపారు. ఆ నివేదిక ఆధారంగా ఎమ్మెల్యే సహా ఆరుగురు వ్యక్తులపై లైంగికదాడి కేసు నమోదు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. బాధిత మహిళ స్టేట్మెంట్ను కూడా రికార్డు చేశామని, తదుపరి చర్యలు చట్టప్రకారం ఉంటాయని తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm