హైదరాబాద్ : ప్రకాశం జిల్లా ప్రజాచైతన్య యాత్రలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తోకలు కత్తిరిస్తామంటూ చేసిన వ్యాఖ్యల పట్ల వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు స్పందించారు. ఎవరి తోకలు ఎవరు కత్తిరిస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారని బదులిచ్చారు. ప్రజలు చైతన్యవంతులు కాబట్టే టీడీపీ పవర్ కట్ చేశారని వ్యాఖ్యానించారు. అధికారం పోయిందని చంద్రబాబు గగ్గోలు పెడుతున్నారని విమర్శించారు. ఐటీ దాడుల నుంచి దృష్టి మరల్చేందుకే బస్సు యాత్ర చేపట్టారని ఆరోపించారు. చంద్రబాబు బస్సు యాత్రలకు భయపడేది లేదని, టీడీపీ బస్సు యాత్రలను ఎవరూ అడ్డుకోవడంలేదని స్పష్టం చేశారు. చంద్రబాబు యాత్రను ఎవరూ లెక్కయడంలేదని అంబటి వ్యాఖ్యానించారు. శవరాజకీయాలు చేయడంలో చంద్రబాబు దిట్ట అని, డబ్బులు వెదజల్లి అధికారం చేజిక్కించుకోవడం చంద్రబాబుకు అలవాటేనని విమర్శించారు. పంచాయతీ రాజ్ చట్టంతో చంద్రబాబుకు వచ్చిన నష్టమేంటని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో డబ్బులు, మద్యం నియంత్రించేందుకు పంచాయతీ రాజ్ చట్టంలో సవరణలు తెచ్చామని వివరించారు.
Mon Jan 19, 2015 06:51 pm