హైదరాబాద్ : కరోనా వైరస్ విషయంలో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరిస్తూనే ఉన్నాయి. అయినా సరే వాటిని పట్టించుకోకుండా కొందరు ఇష్టానుసారం వ్వహరిస్తుండడంతో పలు రాష్ట్రాల్లో పోలీసులు కొరడా ఝలిపిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో కరోనాపై ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్న వారిపై కేసులు పెట్టి.. అరెస్టు చేశారు. ఆదివారం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఈ తరహా ఘటన జరిగింది. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాకు చెందిన ఓ మహిళ (30ఏళ్లకు పైగా వయసు)ను అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. కరోనా కేసుల గురించి తప్పుడు సమాచారాన్ని వాట్సాప్ లో షేర్ చేసినందుకు ఆమెపై చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కోల్ కతాలోని న్యూఅలిపోర్ ఏరియాలో 15 మందికి కరోనా వైరస్ సోకిందని, టెస్టుల్లో పాజిటివ్ అని వచ్చినా కూడా రాష్ట్ర ప్రభుత్వం బయటకు చెప్పడం లేదంటూ ఓ ఫేక్ మెసేజ్ క్రియేట్ చేసిందామె. దానిని తన స్నేహితులతో పాటు కొన్ని వాట్సాప్ గ్రూప్స్ లో షేర్ చేసింది. దీంతో ఒక వాట్సాప్ గ్రూప్ లోని మెంబర్ పోలీసులకు ఈ విషయం చెప్పడంతో ఆమెపై కేసు నమోదు చేసి.. అరెస్టు చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm