హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. రెండు రోజుల క్రితం వరకు 20ల్లో ఉన్న కేసులు ఈరోజుకి సడన్గా 87కి చేరాయి. ఢిల్లీలోని తబ్లిగి జమాత్ కార్యక్రమానికి వెళ్లిన వారు 70మంది ఉన్నారని సీఎం జగన్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ నుంచి 1,085 మంది ఢిల్లీ మీటింగ్కు వెళ్లారు. అందులో 585 మందికి టెస్టులు నిర్వహించినట్టు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. మరో 500 కేసులు టెస్టింగ్లో ఉన్నాయి. వారి రిపోర్టులు రావాల్సి ఉంది. ఇంకా 21 మంది జాడ ఇంకా గుర్తించాల్సి ఉందని సీఎం జగన్ ప్రకటించారు. వారు ఎవరు? ఏ జిల్లాకు చెందినవారు, ఎక్కడెక్కడ తిరిగారు? అనే వివరాలను తెలుసుకోవడం ఇప్పుడు అధికారుల ముందున్న తక్షణ కర్తవ్యం. ఆ 21 మందిని వీలైనంత త్వరగా గుర్తించాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి రెవిన్యూ యంత్రాంగాన్ని ఇప్పటికే ఆదేశించారు. రాష్ట్రంలో ఉన్న గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయ వ్యవస్థను వినియోగించుకుని ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని వీలైనంత త్వరగా గుర్తించాలని సూచించారు. గతంలో సీఎం జగన్ చెప్పినట్టు దక్షిణ కొరియాలో ఒక వ్యక్తి ద్వారా 57వేల మందికి కరోనా సోకింది. కాబట్టి, ఆ 21 మందిని వీలైనంత త్వరగా గుర్తించాలని అధికారులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు గుర్తించిన వారి ద్వారా ఆ మిగిలిన 21 మంది ఆచూకీ వెతికేపనిలో పడ్డారు.
Mon Jan 19, 2015 06:51 pm