హైదరాబాద్: కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో వైద్య సేవలు అందిస్తోన్న వైద్య సిబ్బందికి సరైన సదుపాయాల లేమి ఆందోళన కలిగిస్తోంది. దేశ వ్యాప్తంగా పలు చోట్ల వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు సరైన పీపీఈ కిట్లు, మాస్కులు వంటి సదుపాయాలు లేవని మీడియాకు తెలుపుతుండడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా, విశాఖపట్నంలో వైద్యుడు సుధాకర్ రావ్ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖలోని నర్సిపట్నం ప్రాంతంలో ఉన్న ఓ ఆసుపత్రిలో అనెథ్సెటిస్ట్గా పనిచేస్తోన్న తమకు మాస్కులు అందడం లేవని చెప్పారు. కొవిడ్-19 విజృంభణ నేపథ్యంలో నాకు ఒకే ఒక్క మాస్కు ఇచ్చారు.. దాన్ని 15 రోజుల పాటు ఉపయోగించుకోవాలని చెప్పారు. వారు అసలు ఏమనుకుంటున్నారు? కరోనా పాజిటివ్ కేసులు ఇక్కడకు రావని అనుకుంటున్నారా? దీనిపై ముఖ్యమంత్రి జగన్ దృష్టి పెట్టాలి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, దేశంలోని పలు ప్రాంతాల్లోనూ ఇటీవల ఇటువంటి ఘటనలే వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.
Mon Jan 19, 2015 06:51 pm